Friday, August 28, 2009

కృష్ణ శాస్త్రి

నా మందిర గవాక్షం నుండి తొలి అరుణ స్వర్ణకాంతి వచ్చి
నా కళ్ళను తాకినపుడు కళ్ళు విప్పి స్వాగతం చెపుతాను

వేకువ గాలి వ్రేళ్ళతో
నా మొగము నిమిరినప్పుడు చిరునవ్వు నవ్వుతాను

పెరటిలోనుండి క్రొత్తగా విరిసిన విభాత సుమ
పరిమళం వచ్చి పలకరిస్తే ఔనని తలూపుతాను

కానీ, గవాక్షంలోనికి రవ్వంత ఒదిగిన
మావి కొమ్మ చివర నిలిచి
'కో' అన్న వన ప్రియ రావానికి
బదులు చెప్పలేను
ఇక బదులు మాత్రం చెప్పలేను

---- కృష్ణ శాస్త్రి

( after an operation when he lost his voice)
చిన్న నాటి నుండి అద్బుతమైన రస స్పందన కలిగించిన ఎన్నో పాటలు (నేలతో నీడ అన్నది నను తాకరాదని, ఇది మల్లెల వేళ అని వెన్నల మాసమని, ఆకులో ఆకునై ....) నాకు భావ కవితలంటే మక్కువ కలిగేలా చేసాయి. నాకు నచ్చిన ఎన్నోపాటల రచయిత శ్రీ దేవులపల్లి వారని ఆనాడు తెలియకపొయినా ... తరువాత కాలంలో భావ కవితకు చిరునామగా ఆయన పీరు నా హ్రుదయంలో స్తిర పడింది.మావి చిగురులు తింటూ మధురంగా మనల్ని పలకరించే గండు కోయిలలా తియ్యని కవితలు (ఊర్వశి , కృష్నపక్షం..) మనకు అందించిన ఆ కవి శిఖామని తన స్వరాన్ని కేన్సర్ మహమ్మరికి కోల్పొయిన తరువాత వ్రాసిన ఈ కవిత మానవత్వం ఉన్న ప్రతి వారిని కదిలిస్తుంది.

Thursday, July 2, 2009

పరిచయం

పరిచయం అన్న పదం మన నిత్య జీవితములో ప్రతి రోజూ విరివిగా వాడుతుంటాం. ఈ పరిచయాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. రక్తసంబంధాలతో ఏర్పడే పరిచయాలు కొన్ని అయితే, కొన్ని నిత్య వ్యవహారాలలో ఏర్పడేవి.ఆత్మీయులలో కొన్ని తొలి పరిచయాలు మనకు అసలు గుర్తు ఉండకపోవచ్చు. ప్రవాహంలాంటి జీవన ప్రయాణంలో కొందరు బిందువులా కలిసి ఆత్మీయులు అని గుర్తించేనాటికి వారు మన జీవితాలలో సింధువులా మారి వుండవచ్చు. కొన్ని రైళ్ళలో పరిచయాలలా కొన్ని గంటలలో ముగిస్తే మరి కొన్ని మన జీవితాలలో ప్రభావము చూపించేవి. అయినప్పటికీ వాటిని మనం తెలుసుకోలేము. అటువంటిదే నాకు కిష్టితో ఏర్పడ్డ తొలి పరిచయము.

1976 వ సంవత్సరం లో ఆ ఉషోదయం మా చెరుకువాడ లోని పిల్లలందరికీ ఎంతో ఉత్సుకతతో మొదలైంది. ఇంచుమించుగా ౩౦ మంది వరకు మా రాజులపేట మద్యలో గల రచ్చబండ దగ్గరకు చేరారు. ఆ రచ్చ బండ మద్యలో గల పచ్చగా, ఎంతో మందికి నీడను ఇస్తూ, టీవిగా ఉండే వేప చెట్టు మా అల్లరికి సాక్షిగా నేటికీ అటు వైపు వెళితే ఆత్మీయంగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఈనాటి లాగే ఆనాడు కుడా సంపూర్ణ సూర్య గ్రహణం కావటం, ఈ గ్రహణం గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేయటం, పెద్ద వాళ్ళు పిల్లలకు సూర్య గ్రహణాన్ని గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పటమే ఆ ఆసక్తికి కారణం.

'సూర్య గ్రహణాన్ని సూటిగా చూస్తే కళ్ళు పోతాయన్టరా' అన్నాడు చిన్న ఎర్రోడు
మరి ఎం చేద్దాం' అన్నాడు ప్రసాద్
ఏది ఏమైనా సూర్య గ్రహణాన్ని చూడాల్సిందే అన్నారు అందరూ
నిజం గానే కళ్ళు పోతాయేమో అని బయం గానే ఉంది చాలా మందికి.
సూర్యుడ్ని సూటిగా చూస్తే ప్రమాదం గాని ఏదైనా నల్ల గ్లాస్ అడ్డం పెట్టుకుని చూస్తే ఏమీ కాదు' అన్నాడు కరణం గారి శ్రీను.
అవును మరి మా వూరిలో దిన పత్రిక వచ్చే కొద్ది పాటి ఇళ్ళల్లో వాళ్ళది ఒకటి. పై పెచ్చు కరణం గారంటే మా వురి రైతాంగానికి అందరకి కొద్దో గొప్పో బయం. ఎక్కడ ఏ రకమైన లిటిగేషన్ పెడతారో లాక్కోలేక పీక్కోలేక చావాలని ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉంటారు.
మా శ్రీను గాడు ఇచ్చిన సలహా అయితే అందరికి నచ్చింది. కాని అప్పటి కప్పుడు నల్ల గ్లాస్ ఎక్కడ దొరుకుతుంది. అందరం చుట్టూ చూసాము
మా వేప చెట్టు పక్కనే నర్సు ఇల్లు ఉంటుంది. నిజానికి అది మా వూరి హెల్త్ సబ్ సెంటర్, కాని మా అందరికి అలానే పిలవటం అలవాటు. అక్కడకి ANM కాపురం ఉండటానికి వసతి కూడా ఉంది కాని తను ఏదో సమయంలో రోగులకు మందులు ఇచ్చి వెళ్లి పోయేవారు.కొందరు ఆ బిల్డింగ్ కిటికీలకు ఉన్న గ్లాసును రాయితో బద్దలు కొట్టి ఆ గ్లాసు ముక్కలను పట్టుకొచ్చారు. అందరమూ తలో ముక్కా తీసుకున్నాము. తీరా చూస్తే ఆ గ్లాసు తెల్లగా ఉండటంతో సూర్యుడ్ని చూడటానికి అది ఉపయోగ పడలేదు.
అప్పుడు అన్నయ్య అన్నాడు " ఈ గ్లాసుని దీపపు మసితో ఒక ప్రక్క నల్లగా చేద్దాం అని"
ఎలా ఎలా అని అందరం ఒకటే గోల.
వెంటనే పక్కనే గల హనుమంతు ఇంట్లో నుంచి వాళ్ళ అబ్బాయి కోమటి గాడు దీపం పట్టుకొచ్చాడు.
ఆ దీపంతో అందరం గాజు ముక్కల్ని ఒక వైపు నల్లగా చేసి సూర్యుడిని చూడ సాగాము. గుండ్రంగా ఉన్న సూర్య బింబం కొద్ది కొద్దిగా ఎవరో జామ పండు తిన్నట్టుగా మాయమై పోతోంది. మా గోల అంతా వేప చెట్టు దగ్గర ఉన్న పెద్ద వాళ్ళు, యువకులు చూస్తున్నారు. అందులో నుండి సన్నగా, పొట్టిగా,నల్లగా ఉన్న ఒక కుర్రాడు నన్ను దగ్గరకు పిలిచి నా దగ్గర ఉన్న గాజుని ఒకసారి ఇమ్మన్నాడు. ఆ కుర్రాడ్ని అదే మొదటిసారి నేను చూడటం. అతను ఎక్కడో ఉండి ఇంటర్ చదువుతున్నాడట. సరే అసలు విషయానికి వద్దాం.
అలా అడగగానే ఇచ్చేయడానికి నేనేమన్నా అమాయకుడినా, ఇవ్వనంటే ఇవ్వను అన్నాను.
తను వెంటనే నాలుక మడత పెట్టి కళ్ళు ఎర్రగా చేస్తూ ఇస్తావా ఇవ్వవా అన్నాడు.
పిల్లలు చెప్పిన మాట వినకపోతే పెద్దవాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యేవారు ఆ రోజుల్లో.
" తస్సాదియ్యా దొబ్బెద్దాం అనే" అన్నాను
మరు క్షణంలో సూర్యగ్రహణం సంగతేమో గాని నక్షత్రాలు కనిపించాయి.
రెండు నిమిషాల తరువాత మాత్రమే అర్ధం అయ్యింది. గూభ గుయి మందని, ఆ కుర్రాడు గాజు ముక్కని చేతిలోనుంచి తీసుకొనే ప్రయత్నంలో ఉన్నాడని.
నేను కూడా గాజును గట్టిగా పట్టుకుంటూ " తస్సాదియ్యా......" అనటం
న్యూటన్ ప్రతి చర్యలా చెంప చెల్లుమనటం కంటిన్యూగా జరగటం మొదలైంది.
బుగ్గలు పూరీల్లా పొంగటం ఏంటో అనుభవం లోకి వచ్చింది.
పొంగిన పూరీలు జలపాతంలో తడవటం తెలుస్తోంది.
ఈ గొడవ అంతా చూసి వేండ్ర రాజు గారుగా పిలవబడే ఒక పెద్దాయన పరిగెత్తుకు వచ్చి మమ్మల్ని విడదీసేరు.
ఈ ప్రయత్నంలో పాపం ఆయనకు కూడా తృణమో పణమో బహుమానాలు అందాయి.
ఆయన అన్నారు వాళ్ళ నాన్న హేమాద్రి రాజుకి చెబుదాం ఈడి సంగతి అని.
ఆనాటి సంఘటనతో ఆ కుర్రాడు " కృష్ణ" పేరు నాకు బాగా గుర్తు ఉండి పోవటమే గాకుండా, ఆ కుర్రాడు మూర్కుడు, దుర్మార్గుడు అని మదిలో ఒక ముద్ర పడిపోయింది.
ఇదంతా ఒక గంట తరువాత టచ్ చేయటానికి కూడా ఇష్టపడని ఒక పగిలిన, మసి పట్టిన గాజు ముక్క కొరకు అంటే ఆశ్చర్యమే కాదు ఈ నాటికీ నమ్మబుద్ది కాదు. అహాలు, పట్టుదలలాంటి ఎన్నో బావాలు ఇందులో ముఖ్య పాత్ర పోషించాయని నాకు అనిపిస్తుంది.

అసలు గమ్మత్తు ఏంటంటే తరువాత రోజుల్లో ఈ రౌడీ వెధవ కోసం నేను నా ప్రాణాలకు తెగించే అంత సాహసం చేసే అంత ఆత్మీయుడు అవుతాడని గాని, నా జీవితం లోని ముఖ్య సంఘటనలలో తన ప్రమేయం ఉంటుందని గాని, తన జీవితాంతం మా బంధం కొన సాగుతుందని ఆ రోజు మాకు తెలియలేదు. అతనే నా ప్రియ నేస్తం " కిష్టి"

Friday, June 5, 2009

వేసవిలో ఒక రోజు

అప్పు'డే తెల్లారింది. రాత్రి రెండింటి వరకు చూసిన భారత, పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ బడలిక తీరనే లేదు. రాత్రి ఆలస్యంగా ఇంటికి రావటమే ఒక నేరమైతే, తెల్లవార్లూ క్రికెట్టు గాడిద గుడ్డు అంటూ టీవీ చూస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాకుండా ( తన స్తిర అభిప్రాయం) మరలా ఉదయాన్నే బయలు దేరిన నన్ను చూసి 'ఎస్' అప్రసన్నంగా చూసింది. చదువులు, ఉద్యోగ, వ్యాపార జీవితములో మనిషి తనకంటూ మిగుల్చుకున్న సమయం రాత్రులే కదా! మరి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొవధ్ధూ ! ఏమంటారు.

ఉదయం ఆరు గంటలకే సూరయ్య గయ్యాళి భార్యతో ఆశీస్సులు తిన్నట్లు దుమదుమలాడుతూ ఇంటి నుండి బయటకు వచ్చి మండిపోతున్నాడు. మంద మారుతం మాత్రం చల్లగా శరీరాన్ని తాకుతుంటే నేను నా బైక్ పై ఇంటి నుంచి బయలుదేరి కొమ్మర వెళ్ళటానికి పాలకోడేరు పొలిమేరలు దాటేను. బీటలు ఇచ్చిన చెలకలును చూస్తూ, ఆ చేల గట్ల పై తలలు విరబూసి ఆనందముగా పలకరిస్తున్న కొబ్బరి చెట్లను చూస్తూ ప్రయాణం చేయటం మంచి అనుబూతిని ఇస్తుంది. రోహిణి కార్తి వడ గాల్పులతో ఉడికిన శరీరానికి ఈ ఉషోదయం పేదకు పెన్నిది దొరికినంత సంతోషాన్ని ఇస్తోంది. ఉద్యోగ ధర్మంలో బాగంగానే నా ప్రయాణం జరుగుతున్నా ఇంతలా మనస్సుకు నచ్చటంతో ఎంత దూరం తిరిగినా కష్టం అనిపించటం లేదు.

మోగల్లు గ్రామ రహదారులపై నా ప్రయాణం సాగుతున్నపుడు స్వాతంత్ర సమరయోదుడు అల్లూరి జన్మస్తలం ఈ ఊరే సుమా అని నా మది పదేపదే గుర్తు చేసింది. అత్యంత సాదాసీదాగా ఉన్న ఈ ఊరుని చూసినపుడు గొప్పవాళ్ళు పుట్టటం వల్ల ఊరుకి పేరు వస్తుందా లేక ఆ ఊరులో పుట్టటం వల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా అని అని నాకో డౌట్. రోడ్డు పక్కన మొహాలు కడుగుతున్న కొందరు గ్రామస్తులు, టిఫిన్స్ చేస్తూ, కబురులు చెప్పుకుంటున్న జనాన్ని చూస్తుంటే వీరికి తమ ఊరికి ప్రత్యేకతను తీసుకు వచ్చిన అల్లూరి గురించి గర్వంగా ఉంటుందేమో కదా అని అనిపించింది. కాని అతని గురించి బవిష్య తరాలకు రాతలు తప్ప గురుతులు ఏవీ ఈ గ్రామంలో ఉండవనుకుంటా.అతను జన్మించిన ఇంటిని మ్యుజియంగా మార్చటం, ఆయనకు చెందిన జ్ఞాపకాలను బద్రపరచటంలాంటివి ఆశించటం అత్యాస అవుతుందేమో.

ఈడూరులో శ్రీ సూర్పరాజు గారు కట్టించిన కళ్యాణ మండపం, పార్క్, చక్కగా తవ్వించి నాపరాయి పరిపించిన చెరువు ప్రక్కనుండి వెళుతుంటే, పట్టుమని రెండువేల జనాబా లేని ఈ వూరిలో ఇన్ని సౌకార్యాలా అని మనం అచ్చెరువొంధక తప్పదు. ఇందుకొరకై ఆయన చాలా ఖర్చు పెట్టారని ప్రతీతి. బైర్రాజు ఫౌండేషన్ పుణ్యమా అని ఇలా పల్లెటూర్లు తిరిగే అవకాసం దొరకటం, సేవా భావం ఉన్న మహానీయుల్ని కలిసి వారితో పని చేయటం నా పూర్వ జన్మ సుకృతం.

కొమ్మర వాటర్ ప్లాంట్ కి వెళ్లి అక్కడి రోటీన్ వర్క్ పూర్తి చేసుకున్న తరువాత ఆపరేటర్ గోపితో మాట్లాడుతుంటే "యెన్ " నుంచి కాల్ వచ్చింది. ఈ మద్య కాలంలో తను బిజీగా ఉండటంతో ఈ కాల్ చిరకాలం తరువాత చేయటంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంతకంటే సంతోషకరమైన వార్త ఏమంటే తను ఇండియా వస్తున్నానన్న తీపి కబురు చెప్పటం. నిజానికి ఎవరైనా ఆనందంగా ఉంటే, ఆ ఆనందాన్ని పంచుకోవటం కన్నా సంతోషం ఇంకొకటి వుండదేమో!

మధ్యాహ్నం రెండింటికి కొమ్మరలో కలిసిన ప్రవీణ్తో ఇష్టాగోష్టి మాట్లాడుకుంటూ తిరుగు ప్రయాణమైనాము. వడగాల్పులకు జడిసి జనం ఇల్లు కదలక పోవటంతో రోడ్లు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. అబ్బే ఇది ఎండకాదు వెన్నెల విహారం ఎంత బాగుందో అని మనసును మాయ చేసే ప్రయత్నం చేస్తూ, వడదెబ్బ తగిలి పడిపోకుండా ఇంటికి చేరాను. ఒక అద్బుతమైన కలను వాస్తవము చేసి, గ్రామాలను ఈ రకంగా అభివృద్ధి చేయవచ్చు అని ప్రభుత్వాలకు, తమకు ఏం కావాలో ప్రజలకు తెలియచేసిన ఫౌండేషన్ ట్రస్టీ శ్రీయుతులు రామలింగ రాజు గారికి నా నమస్సులు. అసాద్యాలను ఎన్నిటినో సుసాద్యాలను చేసిన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలలో తొలి నుంచి పాలు పంచుకొనే అవకాసం దొరకటం నా అదృష్టం.

Monday, February 23, 2009

అమ్మమ్మ

నా బాల్యంలో నేను అమ్మమ్మగారింట పెరిగాను. ఆ సమయంలో అమ్మా వాళ్లు అన్నవరంలో మా తాతయ్య అంటే మా నాన్న గారి పెదనాన్న వాళ్ల దగ్గర వుండేవాళ్ళు. చిన్నప్పుడు నేను అల్లరి చాల ఎక్కువ చేసేవాడిని అని , అందువలన అమ్మకు నన్ను చూసుకోవడం కష్టంగా ఉండటం, అంతేకాక నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని మారాం చేయడంతో,( ఎందుకు చేయనూ, ఎంత అల్లరి చేసినా , ఎంత విసిగించినా ఎమీ అనేవారు కాదు) చెరుకువాడలోనే ఉండి అమ్మమ్మ దగ్గర మన ఇష్టారాజ్యంగా పెరిగాను. ఎంత అల్లరి చేసినా అంత సహనంతో, చిరునవ్వుతో ఉండే వారిని నా జీవితంలో ఇంతవరకు ఇంకొకరిని చూడలేదంటే అతిశయోక్తి కాదు.
వసంతం తరువాత గ్రీష్మం వచ్చినట్లే నాకు ఆరేళ్ళ వయస్సులో, అమ్మా వాళ్ళు కూడా చెరుకువాడ వచ్చి స్థిరపడటంతో నా ఎల్లలు లేని అల్లరికి, ఆనందానికి సరిహద్దులేర్పడ్డాయి. ఏంచేస్తాం అందరిలానే నేను కూడా స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితం అయిన నాకు, కొత్త ప్రపంచపు ద్వారాలు తెరిచినట్లయింది. ఆనాటి సహచరులే దండు శంకరం, కరణం గారి శ్రీను , సన్నిధి సత్యనారాయణ, బెజవాడ మాస్టారు గారి అబ్బాయి బాలాజీ, మొదలయిన కొత్త స్నేహితులు అత్మీయులయ్యారు. అగ్నికి వాయువు తోడైనట్లు మా అల్లరికి పట్టపగ్గాలు లేకుండా పోవటంతో అమ్మా నాన్న కంగారుపడి నాకు క్రమశిక్షణ నేర్పాలని ప్రయత్నించటంతో, అమ్మమ్మ నాకు రక్షణగా వచ్చారు. అయినా పట్టిన పట్టు విడవకుండా నాన్న నను శ్రీ వెంకటేశ్వర కాన్వెంటు ఆకివీడులో జాయిన్ చేసారు. అక్కడ ఎందుకు వచ్చేవో తెలియదు గాని , గోదావరి వెల్లువలా మార్కులు వచ్చి క్లాసులో మొదటి రాంక్ వచ్చేసింది.ఆ ఒక్క పర్యాయం ఎందుకో అలా జరిగిపోయింది మరి. అక్కడ నాకు పోటీదారు , స్నేహితురాలు అయిన సుశీల అనే అమ్మాయికి , నాకు తరగతి నాయకత్వం అప్పగించారు.బెరుకు తగ్గటం, కొత్తగా వచ్చిన హోదా వల్లనో ఏమో మరి, మన అల్లరి మరింతగా పెరగటంతో గిట్టని వాళ్లు ఈ వార్త మా నాన్నకి ఉప్పందించటంతో ఆయన నన్ను మరల మా ఊరి స్కూల్లో చేర్పించటంతో హాయిగా వూపిరి పీల్చుకొన్నా.
చిన్న కొడుకు కావటం వల్ల అనుకుంటా తమ్ముడు అమ్మకు ఎక్కువ చేరువగా ఉండటం, నేను అమ్మమ్మకి దత్తుడ్ని కావటంతో , పెద్ద కొడుకుగా అన్నయ్య , నాన్న వాటాకు వచ్చాడు. ఈ వాటాలు గందరగోళం ఏంటంటే ఇంట్లో అమ్మ మేము తినటం కోసం రకరకాలయిన స్వీట్స్, చేగోడీలు, జంతికలు లాంటివి చేసేవారు. ఒకరు ఎక్కువ తిన్నారని, ఒకరివి ఇంకొకరు తిన్నారని అస్తమాను గొడవలు పడిపోయేవాళ్ళం. ఈ గొడవలు తీర్చలేక ఇంట్లో ఉన్నా ఆరుగురుకి వాటాలు వేసేవారు. అమ్మ వాటాకి వచ్చినవి తమ్ముడు, అమ్మమ్మ వాటాకి వచ్చినవి నావి అని మా నమ్మకం, పాపం నాన్న ఇంట్లో ఎక్కువగా ఉండరు కాబట్టి అన్నయ్యకి నష్టం అని ( ఒక వాటా కాబట్టి) మేము అనేవాళ్ళం. వాడు నవ్వే వాడు. మాకు తరువాతి కాలంలో తెలిసింది మాకంటే అన్నయ్యకే ఎక్కువ వాటా వస్తోందని. అది ఎలా సాధ్యం అయిందో నాకు ఇప్పటికీ తెలియలేదు.

అమ్మమ్మ నాకు ఇచ్చిన కొత్త రెండు రూపాయల నోట్లు కట్ట ఒకటి నా దగ్గర ఇప్పటికి బద్రంగా వుంది, అలాగే మరి కొన్ని పది రూపాయలు కూడా తనని పదే పదే గుర్తు చేస్తూ పదిలంగా వున్నాయి.
పగలు స్కూల్స్ కి వెళ్ళాల్సి రావడంతో మా ఆటలు సెలవు రోజులకి, రాత్రులకి విజయవంతంగా మార్పు చేసుకోవటం జరిగింది. ఆ రోజుల్లో మిగిలిన పల్లె జనంలా మేము కూడా ఎక్కువగా రాత్రి వేళలో ఆరు బయట పడుకునే వాళ్ళం. అందువలన అర్ధ రాత్రుల వరకు ఆడుకుని వచ్చి చప్పుడు కాకుండా గుట్టుగా మంచం ఎక్కి దుప్పటి ముసుగు తన్నేవాళ్ళం. ఆలస్యంగా వస్తున్నామని అమ్మా వాళ్ళకు తెలుసు కాని కొన్ని సార్లు తెల్లవార్లూ ఆడుకుని వస్తున్నామని అమ్మా వాళ్ళకు తెలియదనే మా నమ్మకం. అమ్మమ్మని మేము మాయ చేయలేక పోయేవాళ్ళం. మేము వచ్చేవరకు ఎదురు చూసి మృదువుగా మందలిస్తూ జాగ్రత్తలు చెప్పే వారు.
తనకి నా మీద ఉన్న ప్రేమ నా వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. తనకి అత్తింటి వాటాగా వచ్చిన అర ఎకరం పొలం నాకే ఇస్తానని, తన శేష జీవితం నా దగ్గరే వుంటానని అనేవారు. నేను కూడా గొప్పగా అందరితో అమ్మమ్మ నేను ఎప్పటికీ కలిసే వుంటామని చెప్పేవాడిని. చక్కటి వర్చస్సుతో, సన్నగా, తెల్లటి చీరలో ఎప్పుడూ నవ్వుతూ వుండే అమ్మమ్మకి ఆయాసం ఎక్కువ అయింది. భీమవరంలో వైద్య చికిత్స్య చేయించుకొనేవారు.

ఆవిడకు ఆద్యత్మన చింతన ఎక్కువ. ఒంటి పూట భోజనం చేస్తూ సత్సంగం చేసేవారు. ఈ సత్సంగం ఒక్క ముఖ్య కేంద్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా దగ్గర దయాలబాగ్ లో ఉండేది. మిగిలిన భక్తులతో పాటు అప్పుడప్పుడు ( సంవత్సరంలో ఒక పర్యాయం ఉండేదేమో) వెళ్లి వస్తూ ఉండేవారు. అక్కడినుండి వచ్చేటప్పుడు ప్రసాదాలు తెచ్చేవారు. అందులో ఒక స్వీట్ నాకు చాలా ఇష్టంగా వుండేది. అది బూడిద గుమ్మడి కాయతో చేస్తారని తెలిసినపుడు మా ఆశ్చర్యం వర్ణనాతీతం. ఎందుకంటే బూడిద గుమ్మడి కాయతో చేసిన వంటలు కాని వడియాలు కానీ నేను ఏవీ తినేవాడిని కాదు.

శీత గాలులుతో వణికిస్తున్న డిసెంబర్ మాసం. బంగాళాకాతంలో అల్పపీడనం పట్టడంతో చలి మరీ ఇబ్బంది పెడుతోంది. సన్నగా తుంపరతో 14వ తేది తెల్లవారింది. ఆ రాత్రి చలితో బాధపడ్డ అమ్మమ్మ, వేకువనే లేచే అమ్మమ్మ ఇంకా నిద్ర లేవలేదు. తనని ఎవరూ నిద్ర లేపవద్దని అమ్మ గట్టిగా చెప్పడంతో ఉదయం తొమ్మిది గంటల వరకు ఎవరూ తనని నిద్ర లేపలేదు. అప్పటికి కూడా తను నిద్ర లేవక పోవటంతో లేపటానికి ప్రయత్నం చేసిన అమ్మకి తన తల్లి పార్థివ శరీరం చల్లగా తగిలింది. అప్పటికి కాని మాకు అర్ధం కాలేదు. అమ్మమ్మ మా అందరి దగ్గర శాశ్వతముగా శలవు తీసుకుందని, నిద్రలోనే ప్రశాంతముగా మమ్మలిని వీడిపోయిందని. మా మనసులు తెలిసినట్లుగా ప్రకృతి జడి వానతో మమ్మలిని ముంచెత్తింది.
 

నేటివరకు విచ్చేసిన అతిధులు

Free Hit Counter